Thursday, November 29, 2012

పిట్టల గురించి పట్టదా?

‘ఇంత ఛిన్న పిట్టవు. ప్రపంచానికి పట్టవు’-అని అరుణగారు తమ కవితలో పిట్టల గురించి పట్టించుకున్నారు. పిట్టలు, వాటి గూళ్లు నేడు కనబడడం లేదు. పట్నాలలో పావురాలు కూడా తరిగిపోతున్నాయి. పిట్ట కనబడితే పండగ చేసుకోవచ్చు! పిట్టను ఊరపిచ్చుక అని కూడా అంటారు. జంతు శాస్త్రం ప్రకారం దాని పేరు పిట్టా సటైవా. ఇందులోని పిట్ట అనే మాట, అసలయిన మన తెలుగుమాట. సటైవా అంటే మనుషుల మధ్యన, ఇండ్ల మధ్యన, ఇండ్లలో ఉంటుందని అర్థం. మరేమయింది ఈ పిట్ట? పిట్ట గూడు కట్టే పద్ధతి మనిషికి చేతగాదు. అంత సౌకర్యంగా, సురక్షితంగా, అందంగా ఇల్లుకట్టుకోవడం పిట్టకే చేతనయింది. అంత చిన్న పిట్టకు తనకన్నా ఎంతో పెద్ద గూడు కట్టడమంటే కొన్ని రోజులపాటు కొనసాగే కార్యక్రమం. నగరాలలో కాదు, పల్లెల్లో కూడా పిచుకలు లేవిప్పుడు. అందుకు కారణాలు వెదుకుతూ జూలియా అనే షెఫీల్డ్ విశ్వవిద్యాలయం పరిశోధకురాలు పట్నాలు వదిలి కనీసం రోడ్లు కూడా లేని పల్లె ప్రాంతాలకు వెళ్లిపోయారు. గడచిన దశాబ్దాలలో మన మధ్య నుంచి పిట్టలు పారిపోవడానికి, తరిగిపోవడానికి గల కారణాలు, ఆమెకు అక్కడ అర్థమయినయి.

అరుదయిన జంతువులను గురించి పరిశోధించాలనుకునేవారు సాధారణంగా తమ కృషిని కొనసాగించడానికి దీవులను ఎంచుకుంటారు. అక్కడయితే జంతువులు అక్కడే ఉండిపోతాయి. దీవి ప్రకృతి సిద్ధమయిన పరిశోధనశాలగా మారి పరిశీలనలు సులభంగా సాగేందుకు సాయం చేస్తుంది. పిచుకలకు మనం చేసే గోల సహించడం వీలుగావడం లేదని కొంతవరకు గమనించారు. జూలియా ప్రోడర్ ఈ సిద్ధాంతాన్ని మరింత పరిశీలించడానికి ఇంగ్లండ్ తీరంలోని లుండీ అనే పల్లె ప్రాంతానికి చేరుకున్నారు. కానీ, అక్కడ ఆమెకు ఆశ్చర్యం ఎదురయింది. దీవి అంతా ప్రశాంతంగా ఉంది. ఒక చోట మాత్రం పొలంలో కట్టుకునే గుడిసెలాంటి బార్న్ ఉంది. అక్కడ ఉండే జెనరేటర్ అదేపనిగా చప్పుడు చేస్తున్నది. అయినా పిట్టలు ఆ బార్న్‌లోకి వస్తున్నాయి. గుడ్లు కూడా పెడుతున్నాయి. గుడ్లనుంచి పుట్టే పిల్లలపైన గోల ప్రభావం గురించి అక్కడ పరిశీలన సాగింది. గోల లేని చోట, ఉన్న చోట పిల్లల సంఖ్యలో పెద్ద తేడా లేదు. కానీ ఉన్న తేడాలో ఏవో అర్థాలు తోచాయి.

గోలగా ఉండే చోట పిల్లలకు, తల్లి పిట్టకూ మధ్యన సమాచార వినిమయం తక్కువగా ఉంటుంది. అందుకని తల్లి తన పిల్లలకు సరిగా తిండి అందించదని గమనించారు. పిల్లలకు తలిదండ్రులు రావడం తెలియడం లేదు గనుక అవి అరవడం లేదా? లేక పెద్ద పిట్టలకు పిల్లల ధ్వనులు వినిపించడం లేదా? అన్న విషయంలో ఇంకా అనుమానాలు ఉన్నాయి. ఇంతకు ముందు కేట్ వినె్సంట్ లాంటి మరికొందరు పరిశోధకులు పిట్ట పిల్లల తిండి గురించి పరిశోధించారు.

పిట్టలు ముఖ్యంగా పురుగులను తింటాయి. పరిసరాలలో ఆ రకం తిండి, అంటే పురుగులు సరిగా అందకుంటే, పిట్ట పిల్లలు బతికి పెద్దవిగా పెరగడం కష్టమని గమనించారు. ఇక వాతావరణంలో నైట్రోజెన్ డై ఆక్సైడ్ ఎక్కువగా ఉన్నా పిల్లలు సరిగా పెరగవని తెలిసింది కూడా. అంటే ట్రాఫిక్ ఉండే రోడ్ల పక్కన పిట్టలు గూడు కట్టి పిల్లలను కంటే, అవి మిగతా చోట్లలో పిల్లలవలే బలంగా పెరగడం కుదరదని అర్థం. కనుక పిల్లలు పెరగకపోవడానికి కాలుష్యంతో బాటు, గోల కూడా కారణమవుతుందని ప్రస్తుతం పరిశోధనలతో అర్థమవుతున్నది.

మనుషుల మనుగడే కష్టంగా ఉంది గనుక, మన దగ్గర పిచ్చుకల గురించి పట్టించుకునేంత మంచితనం లేదు. సందర్భం వచ్చిందని పిట్టల బొమ్మలను నగరాలలో రోడ్లమీద నిలిపితే వాటికి రక్షణ దొరకదు. ప్రపంచమంతటా, అంతరించిపోతున్న జంతుజాతులను గుర్తిస్తున్నారు. వాటిని రక్షించాలని మాట్లాడుతున్నారు. వరిపొలాల్లో కనిపించే నత్తలు, అంతటా కనిపించే కప్పలు, పిచుకలు వెతికినా కనిపించని కాలం వచ్చింది. ఇంగ్లండ్‌లో కూడా పిచుకలను రెడ్ లిస్టులో చేర్చారు. కానీ, అక్కడ ఇంకా కావలసినన్ని పిట్టలున్నాయని లెక్క చెపుతున్నారు. సుమారు అరవయి లక్షల జతల పిచుకలున్నాయని వారు లెక్క చెపుతున్నారు కూడా!

మనిషికి, ప్రకృతికి మధ్యన వారధిగా ఊరపిచ్చుకలను గురించి చెప్పుకునేవారు. మనకు అన్నింటికన్నా ఎక్కువగా, తరచుగా కనిపించే పక్షులలో అవే మొదటివిగా ఉండేవి. ఒక్కసారిగా 15-20 సంవత్సరాల కాలంలో పిట్టల సంఖ్య తొంభై శాతం వరకు తగ్గిపోయిందంటే ఆశ్చర్యం. ఆ తరుగుదల మొదలయినప్పుడే బ్రిటన్ లాంటి చోట్ల పరిశోధకులు, పరిస్థితిని గుర్తించారు. మనం ఆ అవకాశాన్ని వదులుకున్నట్టు తోస్తుంది. ఒకప్పుడు నగరాలలో పావురాల సంఖ్య మరీ ఎక్కువగా ఉంటూ కొంత సమస్యకు కారణమయేది. ఈ మధ్యన వాటి సంఖ్య కూడా వేగంగా తరిగిపోతున్నది.
పిచ్చుకలు తగ్గడానికి కొన్ని కారణాలు ముందుగా కనబడతాయి. మనం ఇళ్లు కట్టుకునే తీరు మారింది. నేడు పూరిళ్లు పల్లెల్లో కూడా లేవు. మన ఇళ్లు, పరిసరాలు మరింత పరిశుభ్రం, ఆధునికం అయినయి. తోటలు కూడా మరీ మరీ శుభ్రంగా ఉంటున్నాయి. కనుక గతంలో వలే పిచుకలకు తలదాచుకునే చోటు లేదు. తిండి అంతకన్నా లేదు. పిచ్చుకలకు మనుషుల మధ్యనే పచ్చని ప్రాంతాలుండాలి. పొదలుండాలి, పురుగులు ఉండాలి. అవన్నీ మనకు అనాగరికంగా కనిపించే లక్షణాలుగా మారాయి.

నిజానికి మనుషులు ఎక్కువగా తిరగని, పాడుబడిన బంగళాలలో, అపరిశుభ్రంగా, ఎవరూ పట్టించుకోక వదిలిన పార్కులలో పిట్టలు కనబడుతున్నాయట. అక్కడ పిట్టలకు పుష్కలంగా పురుగులు దొరుకుతాయి. ఇళ్లు అందంగా, శుభ్రంగా కట్టుకోవడం అవసరమే కానీ పిట్టలుంటే చుట్టూ ఉండే పురుగులను తింటాయి. మన పరిసరాలు మరింత పరిశుభ్రంగా ఉంటాయి. కొంతమంది పిచుకలు ఉండడానికి అనువుగా గూళ్లను ఏర్పాటుచేస్తుంటారు.

అందులో వాటికి కొంత తిండి కూడా దొరికే ఏర్పాటు ఉంటే పిచుకలు తిరిగి వస్తాయి. ఎక్కడో ఒక మూల చెత్త చేరడం మామూలే. అందులో పురుగులు దొరుకుతాయి గనుక పిచుకలు మరింతగా పెరుగుతాయి. కానీ, నగరాలలో, పల్లెలలో కూడా గోల బాగా ఎక్కువయింది. మిగతా పరిస్థితులు అనుకూలంగా వున్నా, గోల కారణంగా పిచుకలు తరిగిపోతున్నాయి. గోల చేయకుండా బతకడం మనకు చేతనవుతుందన్న నమ్మకం పోయింది. ప్రశాంత వాతావరణం పక్షులకే కాదు, మనకు కూడా మంచిది! ఈ సంగతి అర్థమయితే.. పిట్టలను మనం పట్టించుకున్నట్టే!

1 comment: