Sunday, September 2, 2012

కవిత

ఈ కథ గ్రీసు దేశంలో వేలాది సంవత్సరాలకు ముందు ఎపుడో జరిగింది.

ఎథెన్స్ నగరానికి వెళ్ళే దారిలో ఇద్దరు కవులు కలుసుకున్నారు. కలుసుకున్నందుకు సంతోషంగా ఉందని చెప్పుకున్నారు. నమస్కారాలు, క్షేమ సమాచారాలు మామూలుగానే సాగాయి.


కవులు గనుక సంభాషణ సహజంగా, కవితల వేపునకు మరలింది. ఒక కవి మరొక కవిని అడిగాడు గదా! ‘అయ్యా! ఈ మధ్యన తాజాగా ఏమి వ్రాశారు? తప్పకుండా ఏదో రాసే ఉంటారుగా’ అని!


మొదటి కవి సంతోషంగా ముఖం పెట్టి ‘ఇప్పుడిప్పుడే ఒక మహత్తరమయిన కవిత రాయడం ముగిసింది.
అది నా కవితల్లోకెల్లాగొప్పది. అంతేగాదు, మన భాషలోనే గొప్ప కవిత అదే. అది నేను దేవుడి గురించి స్తుతిస్తూ రాశాను’ అన్నాడు.


కవి అంతే సంతోషంగా తన ముల్లెలోనుంచి కవిత రాసిన పార్చ్‌మెంట్ తీశాడు. ‘ఇదుగో! కవిత! నాతోనే ఉంది. చదివి వినిపిస్తాను. వింటారుగదా! రండి! ఆ సైప్రస్ చెట్టు కింద నీడలో చేరి కవిత అందాన్ని అనుభవిద్దాం!’ అన్నాడు.
కవితాగానం సాగింది. అది మరీ పొడుగాటి కవిత


‘గొప్ప కవితండీ! ఇది కలకాలం నిలిచి ఉంటుంది. తమ కీర్తిని నిలబెడుతుంది!’ అన్నాడు విన్న కవి.
ప్రశాంతంగా విని మొదటి కవి లాంఛనంగా ‘మరి తమరేమి వ్రాశారో? వినవచ్చునా అంటూ అడిగాడు.
‘నేను నిజంగా అంతగా ఏమీ వ్రాయలేదంటే నమ్మండి. తోటలో ఆడుతున్న కుర్రవాడి గురించి సరిగ్గా ఎనిమిదంటే ఎనిమిది పంక్తుల కవిత ఒకటి మాత్రం రాశాను’ అంటూ ఆ కవిత వినిపించాడు.


‘్ఫరవాలేదు. బాగానే ఉంది’ అన్నాడు మొదటి కవి.
తరువాత వారు ఎవరిదారిన వారు పోయారు.


తరాలు గడిచాయి. రెండు వేల సంవత్సరాలయింది. కవి రాసిన ఎనిమిది పంక్తుల కవిత ప్రపంచ భాషలన్నింటిలోకీ అనువదింపబడింది. ఆ కవిత తెలియని మనుషులు ఉండరంటారు.
మొదటి కవిగారి దీర్ఘకవిత కూడా నిలిచి ఉంది. కానీ అది గ్రంథాలయంలో, పండితుల సేకరణలలో మాత్రమే ఉంది. దాన్ని ఇష్టపడేవారు లేకపోలేదు. కానీ చదివినవారు మాత్రం తక్కువ.


-ఖలీల్ జిబ్రాన్ నుంచి

No comments:

Post a Comment