Friday, May 18, 2012

పలుకుబడి- వ్యాస సంకలనం


పలుకుబడి- వ్యాస సంకలనం,
రచన- తెలిదేవర భానుమూర్తి,
లిఖిత ప్రెస్, బాగ్‌లింగంపల్లి,
హైదరాబాద్- 44,
పేజీలు: 169, వెల: రూ.100/-

మాండలికం యాసలో కవితలు, కథలు రావడమే కరువయింది. దానికి రాజకీయ, సాంఘిక కారణాలు ఉన్నాయని అనిపిస్తుంది. భాషాపరంగా కూడా కారణాలున్నాయి. మాండలికంలో రచనలు ఆ ప్రాంతం వారికి తప్ప మిగతా వారికి మింగుడు పడవు. మాండలికం మనుషుల నోళ్లలో ఉంటుంది. దాన్ని కాయితం మీద పెట్టడమే ఒక ప్రయత్నం. నిజంగా పలికే తీరుకు అక్షర రూపం యిస్తే, ఆ అక్షరాలు, ఆ మాండలికం వారే కూడబలుక్కుని చదవవలసి వస్తుంది. ఇగ సమఝకు అచ్చుడు సంగతే ఏర్పాటుగుంటది! అది ఏ యాసయినా ఇదే పరిస్థితి.

తెలంగాణ మాండలికమని ఒక భాష లేదు. తెలంగాణంలో ఒకే జిల్లాలో బోలెడన్ని యాసలుంటయి. మారిన మాటలకు అర్థాలు తోచనుకూడ తోచవు. అటువంటి వాతావరణంలో తెలిదేవర భానుమూర్తిగారు పత్రికలో పనిచేశారు గనుక, ఏకంగా కాలం రాశారు. అది పొలిటికల్ సెటైర్! ఈ సంకలనంలోని వ్యాసాలు ‘చంద్రబాబునాయుడు రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ప్రహసనంపై భానుమూర్తీయమయిన పరిహాసమ’ని ప్రచురణకర్తలే ప్రకటించారు.

పుస్తకం నిండా చంద్రబాబునాయుడే! అజరుద్దీనూ, వాజ్‌పేయి సర్కార్, చంద్రశేఖరూ, దేవేంద్రగౌడూ అక్కడక్కడ తొంగి చూస్తారు. ఇదంతా గతం కథ! అయినా తెలంగాణ మాండలికం చదవాలనుకున్న వారికిది బాగానే ఉంటుంది! ఏ మాండలికమయినా హుషారుగా ఉంటుంది. రాజకీయం మీద చెణుకులు మరింత బాగుంటాయి. అయినా, మందులకన్నా శ్రేష్టం (!) ఉత్తమం, రోగాలు మటుమాయమవుతాయి లాంటి మాటలు మాత్రం, అసలు రచనను పోలి అన్నవేమోననిపిస్తుంది.

మురికి కాల్వలు మంచివి. కమస్కం గండ్లనన్న నీల్లుండయి! (కమ్‌సే కమ్, కనీసం! మన్సుకొచ్చిందా?) ఆత్మ నీల్లల్ల నానదు, నిప్పులల్ల గాలదు, ఆత్మహత్య ఎట్ల జెయ్యొస్తది లాంటి మాటలు నిజంగా కితకితలు పెడతాయి. అప్పులు దెచ్చే కళ, పిలగాడు పరీక్ష ఫేలయినందుకు దావతు, దేవుళ్లమీద విసుర్లు కూడా ఆలోచింపజేస్తాయి. ‘బైరూపులోండ్లు’ రకరకాల అంశాల మీద ఆటలాడి అందించే వ్యాఖ్యానాలు చదివిస్తాయి.

ఇంతకూ చంద్రబాబునాయుడు ఈ వ్యాసాలు చదివి ఉంటారా? నవ్వుకుని ఉంటారా? తప్పక చదివే ఉంటారు. మీరుకూడా చదవండి. అర్ధమయినా కాకున్నా నవ్వు మాత్రం వస్తుంది. గింతకు, తెలంగాణముల గింతగానము ‘గ’కారం వాడుతరా? గట్లనే వాడుతరేమొ? గెవనికెరుక?

No comments:

Post a Comment