Wednesday, February 22, 2012

అవసరాలు - అపాయాలు

బాగా బతకడం అన్న మాటకు అర్థాలు మారిపోయినయి. కూడు, గుడ్డ, గూడూ సరిపోవు. మామూలు వాళ్ళమని అనుకుంటున్న వారలము కూడా ఫ్యాన్ కావాలి, ఫోన్ కొనాలి అనుకుంటున్నాము. వీలయితే బైకు ఉండాలి. లేకున్నా బస్ ఎక్కి ఎక్కడికో వెళ్లాలి. ఈ మాటలను ఇలా పొడిగించుకుంటూ పోతే చివరికి ఒక సంగతి తేలుతుంది. అందరూ ఏదో ఒక రకంగా ఇంధన శక్తిని వాడుతున్నారు. కలిగినవారయితే పవర్‌ను అన్యాయంగా వాడి ఆడుకుంటున్నారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న ఇంధనం సరిపోవడం లేదు. అందరికీ అన్ని సదుపాయాలు అందాలనుకుంటే ఇంతకు పది రెట్లు వనరులు అందుబాటులోకి రావాలి.

సాంకేతిక పద్ధతులు రాను రాను పల్లెలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. అంతా యంత్రాలతోనే నడిచే రోజు ఎంతో దూరం లేదు. దీనికంతా సరిపడే పవర్, ఇంధనశక్తి ఎక్కడ నుంచి రావాలి? పెట్రోలియం లాంటి శిలాజ ఇంధనాలు తరిగిపోతున్నాయి. వాటివల్ల ప్రపంచమే వేడెక్కి, పరిస్థితి మారిపోతున్నది. అందరూ ప్రత్యామ్నాయాలంటూ సౌరశక్తి, గాలిమరల వంటి వేరే పద్ధతులను వాడే ప్రయత్నం చేస్తున్నారు. అసలు రహస్యం ఏమిటంటే... ఈ ప్రత్యామ్నాయ ఇంధనాలవల్ల కూడా ప్రకృతి మీద చెడు ప్రభావాలు ఉంటాయి.


‘పెద్ద గీత-చిన్నగీత’ పద్ధతిలో రాక్షసిలాగా పెట్రోలియం కాలుష్యం ప్రభావాలు కనబడుతున్నాయి. వాటిముందు మిగతా ఇంధనాల వల్ల కలిగే కష్టనష్టాలు చిన్నవిగా, తక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే ఈ రకం ఇంధనాల నుంచి వచ్చే శక్తిని ఇంకా ‘క్లీన్ ఎనర్జీ’ అంటున్నారు. కానీ వాటినింకా ఎక్కువగా వాడవలసిన పరిస్థితి గనుక, రాను రాను వాటి ప్రభావం గురించి కూడా తెలియవస్తుంది. నిజానికి ఈ విషయాలను గురించిన పరిశోధనలు కూడా ఇంకా తొలి దశలోనే ఉన్నాయనాలి. అందరూ అణు విద్యుత్తు గురించి మాట్లాడుతున్నారు. కొందరు మాత్రం దాన్ని భూతంతో పోల్చి భయపెడుతున్నారు. అంతకన్నా చాలా పెద్ద భూతం, మనలను సగం మింగింది. కనుక అణు విద్యుత్తు మంచి పద్ధతిగానే చాలామందికి కనబడుతున్నది. అవసరం ముందు అపాయాలు తక్కువగా కనిపిస్తాయి మరి! అణువిద్యుత్తు మన ఇంధన సమస్యకు శాశ్వత పరిష్కారం కాదని మాత్రం అందరికీ లోలోపల తెలిసి ఉంటుంది. తరగని ఇంధన వనరులను కూడా జాగ్రత్తగా వాడవలసి ఉంటుంది. వాటివల్ల కూడా ఏవో ప్రభావాలు ఉండనే ఉంటాయి. పెద్ద ఎత్తున వాడినప్పుడు మాత్రమే అవి ముందుకు వస్తాయని అంటున్నారు ఇంధన రంగంలోని అనుభవజ్ఞులు. ముందే జాగ్రత్తపడి, గాలి శక్తి లాంటి వనరులను తెలివిగా వాడుకుంటే మిగతా కారణాలవల్ల జరిగిన మార్పులను కూడా తిప్పికొట్టే వీలు ఉందని అంటున్నారు. ఇంధనాలు వాడి సౌకర్యాలు పొందడం గురించి ఈమధ్య ఆసక్తికరమయిన సంగతులు తెలుస్తున్నాయి. ఇంధన శక్తిని ఏ ఉపయోగానికి వాడినా అందులోనుంచి కొంత వేడి పుడుతుంది. అది మరో రకంగా వాడడానికి వీలుగానిది అంటే వ్యర్థమవుతుందని అర్థం. సెల్‌ఫోన్‌లు, కంప్యూటర్‌లు బాగా పెరుగుతున్నాయి. వాటిలోనుంచి వేడి పుడుతుందని తెలుసు. ముందు ఫోన్, కంప్యూటర్‌లోని లోపలి భాగాలు మాత్రమే వేడవుతాయి. ఆ వేడి మనకు అసౌకర్యంగా కనిపించదు. కానీ అది కూడా చివరకు వాతావరణంలోకి చేరుతుంది. వాటిలోనుంచి మరింత శక్తి విద్యుదయస్కాంత తరంగాలుగా మారుతుంది. ఈ తరంగాలు కూడా ఎక్కడోఒకచోట వేడిగా మారుతాయి. వెలుగు కోసం బల్బు వెలిగినా, గాలి కోసం పంఖా తిరిగినా, మరే పరికరాన్ని వాడినా కావలసినంత వేడి పుడుతుంది. చిన్నా, పెద్దా యంత్రాలు అన్నింటినూ ఊహించి, వాటివల్ల భూ వాతావరణం ఎంత వేడెక్కుతున్నదో ఊహించవచ్చు.


మనుషులంతా కలిసి ఒక క్షణంలో పదహారు టెరావాట్ల విద్యుత్తును వాడుతున్నాము. విచిత్రంగా అంతే సమయంలో సూర్యుని నుంచి 1,20,000 టెరావాట్ల సౌరశక్తి భూమి వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ లెక్క ఎంత శక్తి వచ్చింది, ఎంత తిరిగి వెళ్లిపోయింది అనే వివరాల మీద ఆధారపడి ఉంటుంది. వాతావరణంలోకి వచ్చినంత వేడి తిరిగి బయటకు కూడా పోతుంటే, లోపల స్థితి సమతూకంలో ఉంటుంది. ఒకవేళ తేడా వచ్చి వాతావరణం వేడెక్కితే సమతూకం వచ్చేదాకా, వేడిమి వెలుపలికి పంపే పద్ధతి మొదలవుతుది కానీ, సమతూకం కొంత ఎక్కువ వేడి దగ్గర కుదురుకుంటుంది. గడచిన వేల సంవత్సరాలుగా ఈ తంతు జరుగుతూనే వుంది. అయినా వాతావరణం మాత్రం చెప్పుకోదగినంత వేడెక్కలేదు. ప్రస్తుతం మాత్రం గ్రీన్ హౌస్ గ్యాస్‌ల కారణంగా వేడి పెరుగుతున్నది. కారణంగా వచ్చే వేడికన్నా 380 టెరావాట్లు తక్కువ వేడి వెలికి పోతున్నది అంటే భూవాతావరణం వేడెక్కుతున్నదని అర్థం!


ఈ లెక్కతో పోలిస్తే, మనుషులు తమ సదుపాయాల పేరున పుట్టిస్తున్న 16 టెరావాట్ల వేడిమి మరీ అంత ఎక్కువ కాదు కానీ, రాను రాను ఈ సమస్య మరింత ఎక్కువవుతుంది. మనుషులు అయిదువేల టెరావాట్లు విద్యుత్తు వాడే రోజు త్వరలోనే వస్తుంది. అప్పటికి వాతావరణం మరో మూడు డిగ్రీల వేడి ఎక్కువవుతుందని లెక్క తేల్చారు!


కార్బన్‌డై ఆక్సైడ్ కారణంగా పుట్టే వేడి తన దారిని తాను వాతావరణాన్ని వేడెక్కించి సమస్యను మరింత పెంచుతుంది. ఆ వేడి వేరుగా ఉందని మనం గుర్తుంచుకోవాలి. ఈ లెక్కలు చేసిన చైసన్ అనే పరిశోధకుడు, ‘ఇవన్నీ తప్పు అని ఎవరైనా రుజువుచేస్తే బాగుండును. నావన్నీ కాకిలెక్కలే అంటే బాగుండును’ అని చమత్కరించాడు. సైన్సులో ఇదేమంత గొప్ప జోక్ కాదు. కానీ చైసన్ లెక్కలను ఇప్పటివరకూ ఎవరు ‘తప్పు’ అనలేదు.


మరైతే మనిషి ఇంధనశక్తి వాడకం తగ్గించాలా? అన్నది ప్రశ్న. ఆ అవసరం లేదుగానీ శక్తి ఎక్కడనుంచి వస్తుందన్నది ముఖ్యమంటున్నారు పరిశోధకులు. సౌరశక్తి కాక మరే వనరులయినా అదనపు నష్టాన్ని కలిగిస్తాయి. ఎండ ఏదో ఒక రకంగా వేడిని పుట్టించక మానదు. ఎండ కారణంగా వచ్చే గాలి, జల విద్యుత్తు, అలల నుంచి శక్తి కూడా సౌరశక్తికి సంబంధించినవే. కనుక వాటివల్ల నష్టం లేదని అంటారు చైసన్. ఈయన ప్రఖ్యాత పరిశోధకుడు, రచయిత కార్ల్ సేగన్ శిష్యుడు. సేగన్ కూడా ఇదే దారిలో మాట్లాడేవారు. అంతరిక్షంలో సోలార్ ఎనర్జీ పుట్టించడం కూడా అదనపు వేడికి దారితీస్తుందని ఆయన అనేవారు. అవసరాలకు, అపాయాలకు సరైన చోటిచ్చి గుర్తించాలని వీళ్ల వాదం.

No comments:

Post a Comment