Tuesday, February 7, 2012

ప్రొఫెసర్ నాయుడమ్మ - పుస్తకం


విశిష్టం.. శాస్తజ్ఞ్రుడి జీవన చిత్రం

డా.వై.నాయుడమ్మ
రచన: డా. సోమరాజు సుశీల
సి.పి.బ్రౌన్ అకాడమి 53,
నాగార్జునహిల్స్,
పంజగుట్ట, హైదరాబాద్-82
పేజీలు: 134;

వెల: రూ.95/-


సి.పి.బ్రౌన్ అకాడమీవారు విరివిగా చేస్తున్న పుస్తక ప్రచురణలో 25కు పైగా పుస్తకాలు వివిధ రంగాలకు చెందిన మహనీయుల జీవిత చిత్రాలు. వాటిలో ఒక సైంటిస్టు గురించి వచ్చిన పుస్తకం ఇదేననవచ్చు. నాయుడమ్మగారు కేవలం ఒక సైంటిస్టు కాదు. గొప్ప మానవతావాది. అట్టడుగు వర్గాల మేలుకొరకు పాటుపడిన ఆదర్శమూర్తి. ఈ ప్రపంచంలో చాలా కొద్దిమంది జీవితాలు మాత్రమే అందరూ అనుసరించవలసిన బాటలుగా సాగుతాయి. అటువంటి అరుదయిన వ్యక్తులలో నాయుడమ్మగారి పేరు ముందు వస్తుంది.


‘నేను పుట్టుకతో రైతును! వృత్తిద్వారా అంటరాని వాడిని, రెండింటి గురించి నేను చాలా గర్వపడతాను!’ అన్నారు డాక్టర్ యెలవర్తి నాయుడమ్మ. ఆయన తమ పరిశోధనకొరకు ఎంచుకున్న రంగం తోలు పరిశ్రమ. ఎన్ని రకాల పదవులు, అవకాశాలు వచ్చినా ఆయన ఈ రంగాన్ని మాత్రం వదలలేదు. భారతదేశంలో శాస్త్ర పరిశోధనలు, మామూలు ప్రజలకు పనికివచ్చేలా సాగవు. నిజానికి అవి ఎవరికీ పనికిరావు అన్న విమర్శ ఉంది. వౌలిక పరిశోధనలు కొంతవరకు ఆ రకంగా ఉంటే ఉండవచ్చు. వ్యవసాయం, ఆరోగ్యం, పరిశ్రమల విషయంలో మన దేశంలో జరిగిన పరిశ్రమ మామూలువారికి కూడా అందుబాటులోకి వచ్చే విప్లవాలకు కారణమని చాలామంది గమనించరు. నాయుడమ్మగారి నేతృత్వంలో దేశంలో జరిగిన ‘తోలు’ గురించిన పరిశోధనకు ప్రపంచస్థాయిలో ఎంతో గుర్తింపు ఉంది. అంతేగాదు బడుగు చర్మకారులకు సాయపడింది!


నాయుడమ్మగారి జీవిత చిత్రాన్ని డా.సోమరాజు సుశీలగారు రాయడం ఎంతో ఉచితంగా ఉంది. ఆమె నాయుడమ్మగారిని స్వయంగా ఎరిగినవారు. నాయుడమ్మగారి పరిశోధనలు, నిర్వహణ విధానాలవల్ల లాభపడినవారు కూడా. అందుకే, స్వయంగా కెమిస్ట్రీ పరిశోధకులయిన సుశీలగారు నాయుడమ్మగారి పరిశోధనల గురించి, దేశంలో సైన్సు, పరిశోధన, సంస్థలు, పరిశ్రమల గురించి బాగా రాయగలిగారు.


నాయుడమ్మగారు మద్రాసులోని చర్మ పరిశోధన సంస్థలో తమ కృషిని ప్రారంభించి, ఆ సంస్థకు నిర్దేశకులయ్యారు. భారతదేశంలో చర్మ పరిశ్రమకు కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. శాస్త్ర, సాంకేతిక పరిశోధనలను నడిపించే సి.ఎస్.ఐ.ఆర్‌కు ఆయన డైరెక్టర్ జనరల్ అయ్యారు. ‘నేను రిటైర్‌మెంట్‌దాకా ఆ పదవిలో ఉండను. అయిదు సంవత్సరాల తర్వాత వచ్చి, నా పరిశోధన చేసుకుంటాను, మీకు అంగీకారమయితేనే వస్తాను!’ అని దేశ ప్రధానమంత్రికే సూటిగా చెప్పగలిగారు నాయుడమ్మ. ఆయనకు తమ పరిశోధన మీద గల అంకితభావం, అక్కడ ప్రపంచానికి కనబడుతుంది. నిర్వహణదక్షుడయిన నాయుడమ్మగారు, చర్మ పరిశోధన సంస్థలో ఒక ఎకనామిక్స్ శాఖను కూడా ఏర్పాటుచేసి, పరిశోధనలను వాడడం వేపు చూసిన దృష్టి ఆశ్చర్యం కలిగిస్తుంది.
‘కాయబోయే కాయలకన్నా, పండిన ఫలాలను పంపిణీ చేయడంపై ఆయన దృష్టి ఉండేదని’ సుశీలగారు రాశారు. అన్ని రంగాలలోనూ ఈ రకం ఆలోచన ధోరణి కొంత ఉన్నా, దేశం ప్రపంచం ఎంతో బాగుపడతాయి.


నాయుడమ్మగారిని ప్రఖ్యాత జెఎన్‌టియుకు వైస్ ఛాన్సలర్‌గా ఏరికోరి నియమించారు. అక్కడ తనకు కుదరదని, ఆయన తిరిగి పరిశోధనలోకి వచ్చేశారు. ప్రతి అనామకుడూ అధికారంకొరకు పాకులాడుతుండడం అందరికీ తెలిసిందే.
ఈ పుస్తకంలో నాయుడమ్మగారు తమ కార్యదర్శులకు రాసి ఇచ్చిన పనె్నండు సూత్రాలు, అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టీఆర్‌కు రాసిన లేఖ లాంటి కొన్నింటిని అనువదించి పొందుపరిచారు. నాయుడమ్మగారు అమలుచేసిన కరీంనగర్ ప్రాజెక్టు వివరాలు కూడా ఇందులో ఉన్నాయి. వీటిని, మొత్తంమీద ఈ పుస్తకాన్ని అందరూ చదవాలి. చేతనయితే దీన్ని ఇంగ్లీషులోకి అనువాదం చేయించి దేశంలోని శాస్త్ర పరిశోధకులందరికీ అందజేయాలి!


కేవలం రెండుమూడు గంటలు మాట్లాడినంత మాత్రాన, ఒక వ్యక్తి జీవితమంతా గుర్తున్నారంటే, ఆ వ్యక్తి నిజంగా ఆదర్శమూర్తి. అటువంటి అనుభవం ఈ సమీక్షకునికి మిగిలించారు నాయుడమ్మగారు. ఆంగ్ల చిత్రాల నటుడు గ్రెగరీపెక్ లాగ కనిపించే నాయుడమ్మగారు, ‘ఫీడ్, ఫాడర్, ఫెర్టిలైజర్’ అనేవి మూడు కుదిరితే ఆంధ్ర దేశం మరింత ముందుకు సాగుతుందని రేడియో పరిచయంలో చెప్పిన మాటలు యింకా చెవుల్లో గింగురుమంటున్నాయి
.
హాస్యప్రియులు, జీవితాన్ని ప్రేమించిన వ్యక్తిఅయిన నాయుడమ్మగారి ఆసక్తికరమయిన జీవితానికి ఈ పుస్తకం ‘కొండను అద్దంలో చూపించే’ ప్రయత్నం. అయినా జీవన చిత్రంలో ఉండవలసినవన్నీ ఇందులో ఉన్నాయి. కనుక, ఈ పుస్తకాన్ని అందరూ చదవాలి. అందరిచేత చదివింపజేయాలి.

No comments:

Post a Comment