Friday, November 18, 2011

ఆహార వ్యవస్థలో మార్పులు


ప్రపంచ జనాభా ఏడువందల కోట్లకు చేరింది. అందులో వందకోట్ల మందికి తిండి కరువయిందంటున్నారు. నిజానికి ప్రపంచంలో పండుతున్న పంటమాత్రం అందరికీ సరిపడేటంతగానూ ఉంటున్నది. పంపిణీ అంతటా ఒకే రకంగా కుదరడం లేదు. ధరలు పెరుగుతుండడంతో చాలామంది తమకు కావలసిన ఆహారాన్ని కొనలేకపోతున్నారు.

జనాభా పెరగుతూనే పోతుంది. 2050 నాటికి మరో రెండు మూడు బిలియనుల మందికి తిండిపెట్టవలసిన పరిస్థితి వస్తుంది. అంటే ఆహారం అవసరం రెండింతలవుతుంది. రానురాను చాలామందికి ఆదాయాలు పెరుగుతాయి. కనుక ఆహారం అవసరాలు కూడా మారతాయి. మరోవేపు ‘జీవ ఇంధనాల’ పేరున పొలాలను మరిన్ని అవసరాలకు వాడుకుంటామని అంటున్నారు. అంటే మొత్తానికి వ్యవసాయం, ఫలసాయాల గురించి, మరింతగా ఆలోచించవలసిన పరిస్థితి మనముందు ఉంది.

వ్యవసాయం పేరున అడవులు నాశనమవుతున్నాయి. వీలున్న ప్రతిచోటా పంటలు వేస్తున్నారు. ఈ రకంగా వ్యవసాయం, పర్యావరణానికి హాని కలిగిస్తున్నది. అందుబాటులో ఉండే భూమి ఎక్కువ శాతం వ్యవసాయానికే వాడుకవుతున్నది. నీరు కూడా వ్యవసాయానికే ఎక్కువ కావాలి. వ్యవసాయం కారణంగా, ఆహార పరిశ్రమ కారణంగా కాలుష్యం కలుగుతున్నదంటే ఆశ్చర్యం కాదు. మొత్తానికి వ్యవసాయం పెరగాలి. దానివల్ల కలిగే చెడు ప్రభావాలు మాత్రం పెరగకూడదు.

ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న ఏడువందల కోట్ల మందికి ఆహారం అందాలి. వచ్చే నలభయి సంవత్సరాలలో ఆహారం ఉత్పత్తి రెండింతలు కావాలి. ఈ రెండు పనులు జరగుతున్నా సరే కాలుష్యం మాత్రం పెరగకూడదు. ప్రపంచ ఆహార వ్యవస్థ, ఈ మూడు అవసరాలను ఒకటి చేస్తూ ముందుకు సాగాలి. ఇది కుదిరే పనేనా అన్న ప్రశ్నకు జవాబు చెప్పడానికి జూనాతన్ ఎ ఫోలీ నాయకత్వంలో ఒక నిపుణుల బృందం ప్రయత్నించింది. నీటి ఉపయోగం, కాలుష్యాలను జాగ్రత్తగా గమనిస్తూ గ్రీన్ హౌస్ వాయువులను నియంత్రణలో ఉంచుతూ, జంతు, వృక్షజాతులకు హాని కలుగకుండా, పంటను రెండింతలు చేయడానికి ఈ పద్ధతులు వీలు కలిగిస్తాయని వారు సలహా యిస్తున్నారు.
స్థూలంగా ఈ సూచనలను పాటిస్తే ఫల సాయాన్ని పెంచడం వీలవుతుంది. పండిన పంటను అందరికీ అందేరకంగా పంపిణీకి వీరి పథకంలో గట్టి సలహాలున్నాయి. వాతావరణ కాలుష్యం జరగకుండా చూడడం మీద మరింత కేంద్రీకరించినట్లు కనబడుతుంది.

శ వ్యవసాయ భూముల విస్తీర్ణం పెంచే పద్ధతి మానుకోవాలి: అడవులు, గడ్డి మైదానాలను పంటపొలాలుగా మార్చడం మంచి పద్ధతి కాదు. అడవులకు కార్బన్ సైకిల్లో పెద్ద పాత్ర ఉంది. వాతావరణం వేడెక్కడం, అందరూ పట్టించుకోవలసిన సమస్య.

శ ఫలసాయం పెరగాలి: తిండి అవసరం రెండింతలవుతుంది. అయినా పంట పొలాల వైశాల్యం మాత్రం పెరగకూడదు. అంటే ఉన్న పొలాలలో నుంచే రెండింతల దిగుబడి తీయాలి. పంటలో జన్యుపరంగా, నిర్వహణ పరంగా మార్పులు తీసుకు రాగలిగితే ఇది వీలవుతుంది. ఇక్కడ బాగా పండే పొలాలలో దిగుబడి పెంచడం ఒక పద్ధతి. తక్కువ పంటనిచ్చే పొలాల నుంచి ఎక్కువ దిగుబడి తీయడం మరొక పద్ధతి. ఈ రెండవ పద్ధతి బీద దేశాలకు వరం లాంటిది.

శ వనరులను మరింత బాగా వాడుకోవాలి: దిగుబడి ప్రస్తుతం ఎలాగున్నా దాన్ని పెంచాలి. కానీ ఆ ప్రయత్నంలో నీరు, ఎరువులు, ఇంధనశక్తి లాంటి వనరులను ఇష్టం వచ్చినట్టు వాడితే సమస్య మరింత పెరుగుతుంది. ఒక కాలరీ పండును పెంచడానికి ఒక లీటరు నీరు అవసరమంటే ఆశ్చర్యం కదూ? ఈ నిపుణుల సంఘం వారు ఈ పరిస్థితిని మార్చాలంటున్నారు. చుక్కనీరు (డ్రిప్ ఇరిగేషన్), మార్చింగ్, నీరు వ్యర్థం కాకుండా చూడడం లాంటి పద్ధతులను మరింత వాడాలంటున్నారు.
ఎరువుల విషయంలో పరిస్థితి మరింత అన్యాయంగా ఉంది. ఎవరూ ఎరువులను ‘సరయిన’ పద్ధతిలో, మోతాదుల్లో వాడడం లేదు. చైనాలో మన దేశంలోని ఉత్తర ప్రాంతాలలో మధ్య యు.ఎస్., యూరపు పడమటి ప్రాంతాలలో రసాయన ఎరువుల వాడకం, అవసరానికి ఎన్నోరెట్లు ఎక్కువగా జరుగుతున్నట్లు ఈ బృందం వారు చెపుతున్నారు. దున్నడం, ఎరువు అవసరమయిన చోట మాత్రమే వేయడం ఆర్గానికి వ్యవసాయం లాంటి పద్ధతులు వాడాలంటున్నారు.

శ తిండి పద్ధతులు మారాలి: పంటలను, పశువులకు, జంతువులకు మేతగా పెట్టి వాటిని బలిపించి ఆ తర్వాత తినడం ప్రస్తుతం ఎక్కువ జరుగుతున్నది. అందుకు బదులు మనుషుల ఎక్కువగా పంటలను తామే తినడం మంచి పద్ధతి అని ఈ సంఘం సూచించింది. శాకాహారం ఎక్కువగా తింటే పరిస్థితి మారుతుందట.
శ పండిన ఆహారం వ్యర్థం కాకుండా జాగ్రత్త పడాలి: ప్రపంచంలో పండిన పంటలో మూడవ వంతు వ్యర్థంగా పోతున్నదట. ఇందులో ఎలుకుల వంటి జీవుల పాత్ర కూడా ఉంది. ధనిక దేశాల్లో వండిన తిండి వ్యర్థమవుతుంది. ఉంది గనుక, తిండి తిని బొజ్జలు పెంచుకుంటున్నారు కొందరు. బీద దేశాలలో పంట, ఉత్పత్తి దగ్గరే నాశనమవుతుంది. మొత్తంమీద ఆహార పదార్థాలను చేతయినంత వరకు వ్యర్థం కాకుండా చూడగలిగితే అందరికీ మంచిది.

అందరూ అన్ని పంటలూ పండించకూడదనీ, అనుకూలమయిన పంటలను, వనరుల ఆధారంగా పండించి, అందరి అవసరాలు తీరేతీరుగా ఇచ్చి పుచ్చుకోవడం మంచిదనీ సూచనలు వచ్చాయి. తొమ్మిది వందల కోట్ల మందికి ఆహారం అందించాలి. మానవజాతి ఇంతకు ముందెన్నడూ ఇంతటి సమస్యను ఎదురుకున్నది లేదు!

No comments:

Post a Comment