Tuesday, November 29, 2011

ఏడు వందల కోట్లు - ఏమవుతుంది?


జనం, మరింతగా జనం

భారతదేశంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను అమలుచేసిన తీరు కారణంగా గతంలో కొంతమందికి చెడ్డపేరు వచ్చింది. ఒక దశాబ్దం కింద అందరికీ అదే చర్చనీయాంశంగా కనిపించిన ‘జనాభా సమస్య’ ఇప్పుడు ఎందుకు తెరమరుగు అయిందో తెలియదు. 2011 అక్టోబరు 31న ఈ ప్రపంచంలోని ఏడు బిలియనుల జనాభాలో చివరి వ్యక్తిగా మన దేశంలో ఒక శిశువు పుట్టినట్టు చెప్పారు. ఆ ఘనత మరో దేశంలో మరో శిశువుకు ఉందన్నారు కూడా. మొత్తానికి 700 కోట్లలో మనమూ ఒక్కరం అయ్యాము! ఈ సంఖ్య గంటకు 10వేలమంది చొప్పున పెరుగుతూ పోతున్నది. 

2050 నాటికి జనాభా 9.3 బిలియనులు (930 కోట్లు) అవుతుందని ఐక్యరాజ్యసమితి అంచనా. ఆ సంఖ్య అటూ ఇటూ అవుతుందనడంలో ఆశ్చర్యం లేదు. 1950లో ప్రపంచ జనాభా 250 కోట్లు. ఈసారి 2050 లెక్కలో తేడా అంత ఉండవచ్చునంటున్నారు! పుట్టిన ప్రతి మనిషికీ కూడు, గుడ్డ, గూడు కావాలి. అవసరాలు అంతటితో ఆగితే బాగుండును. కాలం మారింది. ప్రతి మనిషికీ కరెంటుగానో, మరో రూపంగానో ‘శక్తి’ కావాలి. పుట్టిన ప్రతి మనిషి నుంచీ వ్యర్థ పదార్థాలు పుడతాయి. ప్రతి ఒక్కరూ కాలుష్యం కలిగిస్తారు. ఇందులో బీద, ధనికుల మధ్య కొంచెం తేడా ఉండవచ్చుగానీ, మొత్తంమీద ప్రపంచం మీద ప్రభావం మాత్రం తప్పదు. పర్యావరణంతోబాటు, సామాజిక, ఆర్థిక సమస్యలకు జవాబులు అంత సులభంగా అందనిరోజులు ముందున్నాయి అంటున్నారు ఆలోచనగలవారందరూ!
1970 ప్రాంతంలో అందరూ జనాభా గురించి చర్చించేవారు. మన దేశం, చైనా వంటి చోట్ల ‘జనాభా సమస్య’ను గొప్ప జాతీయ విపత్తుగా గురించి కార్యక్రమాలు అమలు చేశారు. అందులో చాలా మొరటుతనం కనిపించింది కూడా. సరిగ్గా 12 ఏళ్ల క్రితం ఆరువందల కోట్లకు చేరిన జనాభా, చూస్తూండగానే మరో మైలురాయిని దాటింది. పనె్నండు సంవత్సరాల క్రితం ప్రపంచం మరోరకంగా ఉండేదని బల్లగుద్ది చెప్పవచ్చు. ప్రస్తుతం మనిషిని చుట్టుకున్న సమస్యల రూపం మారింది. భద్రత ఏ రంగంలోనూ కనిపించకపోవడం కొట్టవచ్చినట్టు కనబడే లక్షణంగా వచ్చింది!

ఎటు చూచినా, ఏ అంశాన్ని చర్చించినా, అది చివరకు జనాభా సంఖ్యను ముందుకు తెచ్చి నిలబెడుతుంది. దేశాలమధ్య వలసల నుంచి మొదలు, వ్యాపారం దాకా అన్నింటిలోనూ మనుషుల సంఖ్య ‘భయంకరంగా’ ముందుకువచ్చి భయపెడుతున్నది. ఇదే రకంగా పరిస్థితి కొనసాగితే, మనమనుకుంటున్న మానవవిజయాలే మన జాతికి శత్రువులుగా మారతాయా? మనుషుల మనుగడకు మంగళం పాడతాయా? అన్న ప్రశ్న పుడుతుంది! ఈ భూమి 700 కోట్ల మందిని మోయగలుగుతుందా? వారి అవసరాలను అందిస్తుందా?

ఈ ప్రశ్నలు చాలామంది మనసుల్లో ఉన్నాయి. కానీ అందరూ బాహాటంగా అడిగింది మాత్రం లేదు. అడిగిన తరువాత అవి భయంకరంగా కనిపిస్తాయి. తప్పదు. కానీ, జవాబు మాత్రం అంతకంటే ఆశ్చర్యంగా ఉంటుంది! నమ్మండి, ఈ ప్రపంచానికి ఏడు వందల కోట్ల జనాభా భారం కానే కాదు! వీళ్లందరినీ తెచ్చి మన దగ్గరి పెద్ద రాష్ట్రంలో ఒక దాంట్లో ఉంచవచ్చు. అయినా అక్కడ రద్దీ, పెద్దనగరాల్లో ఉన్న కంటే ఎక్కువ మాత్రం కానే కాదు. నగరాల్లో అందరూ, అంత రద్దీలోనూ హాయిగా బతుకుతూనే ఉన్నారు. వీళ్లందరికీ సరిపడేంత తిండి ఈ ప్రపంచంలో సిద్ధంగా ఉంది. నీరుంది. మిగతా అవసరాలూ ఉన్నాయి. ముందుకాలంలోనైనా, ప్రస్తుతమైనా, వనరులు సమస్య కావు. వాటి పంపిణీ, జనం వాటిని కొనగలిగే శక్తి మాత్రమే అసలైన సమస్యలు.

నిజానికి ఈ ప్రపంచంలో మరింతమంది వచ్చి చేరినా తగినన్ని వనరులు కొంతకాలం వరకూ ఉంటాయి. 1820 ప్రాంతంలో పారిశ్రామిక విప్లవం మొదలయింది. 2008లో మాత్రమే ప్రపంచంలో ఆర్థిక మాంద్యం మొదలయింది. ఈ మధ్యన ప్రపంచంలో ఆర్థిక ఉత్పత్తి 11 రెట్లు పెరిగిందన్నమాటను ఎవరూ కాదనలేరు.

మనిషి సగటు జీవన కాలం 70 సంవత్సరాలకు పెరిగింది. ప్రతి తల్లీ కనే పిల్లలసంఖ్య సగానికి తగ్గింది. నిజానికి జనాభా పెరిగే రేటు తగ్గింది! ఈ రకంగా గమనిస్తే, సమస్య మనుషుల సంఖ్య కాదని సులభంగానే గుర్తించవచ్చు. ఈ మనుషులు ఎంత ఉత్పత్తి చేస్తున్నారు, ఎంత వాడుకుంటన్నారన్నది అసలు సమస్య! ఆఫ్రికాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. చైనా, మన దేశం ఎంత జనాభా ఉన్నా, నెట్టుకు వస్తూనే ఉన్నాయన్న సత్యాన్ని గుర్తించాలి. పరిస్థితి అంతటా ఒకరకంగా ఉండకపోవడం అసలు సమస్య! జనాభా ఎక్కువగా పెరుగుతున్న చోట్ల వనరులు తక్కువగా అందుతున్నాయి. ఈ పరిస్థితిని జారెడ్ డయమండ్ లాంటి పరిశోధకులు చక్కగా విశే్లషించారు.
ప్రపంచంలో 700 కోట్లమంది ఉన్నామిప్పుడు. ఇందులో వంద కోట్ల మందికి కనీస వనరులు కూడా అందడంలేదు. అందుకు కారణం, వారి అవసరాలకు సరిపడా తిండి, నీరు లాంటివి లేకపోవడం మాత్రం కాదు. నిజానికి పండిన పంటల్లో సగం నాశనమై, ఎవరికీ ఉపయోగపడకుండా పోతున్నదన్న సంగతిని అందరూ గుర్తించాలి. తలుచుకుంటే ఈ ప్రపంచం మరో రెండు వందల కోట్ల మందిని కూడా భరించగలదు. ఈలోగా, పర్యావరణం, సరఫరా, ఇంధనాలు మొదలైన అంశాలను గురించి సరైన పథకాలు అమలు కావాలి! మనుషులు మాత్రం బాగుంటే చాలదు, మిగతా ప్రపంచం, జీవులు కూడా బాగుండగలగాలి! అదే అసలు సమస్య!

జనాభా - ప్రభావం

జనాభా పెరిగినందుకు పెద్ద నష్టం లేదంటున్నవారి మాట సత్యమే! అయినా సమస్యను సమస్యగా చూడవలసిన అవసరం మాత్రం ఉండనే ఉంది. మనుషుల అవసరాలను అందించినంత మాత్రాన సరిపోదు. ఆ తతంగం ప్రభావంగా జరిగే మిగతా మార్పుల గురించి పట్టించుకుంటే గాని మనుషుల మనుగడ అనుకున్నంత సుఖంగా సాగదు.
మునుముందు ఏం జరగనున్నదీ అంచనా వేయడం కష్టం. గతంలో జరిగినవన్నీ తరువాత కూడా జరుగుతాయన్న నమ్మకం లేదు. ఇప్పటివరకు, ఎదురైన సమస్యలను ఏదో రకంగా నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నాం. ఎంతటి సమస్యలున్నా ఎదుర్కొనేందుకు ఎక్కువమంది మనుషులుంటారన్న వాదం బాగానే ఉంది. కానీ, పరిస్థితిని అంత సులభంగా అంచనా వేయకూడదు. మనుషులు ఎక్కువయితే, ముందుగా భూగోళం మీద ప్రభావం ఎక్కువవుతుంది. మనుషులు అన్ని విధాలా మునుముందుకు సాగుతుంటే, మిగతా జీవుల పరిస్థితి మాత్రం నానాటికీ తీసికట్టు అయిందన్నది ఇప్పటికే మన అనుభవం. ఎన్నో రకాల జంతు, వృక్షజాతులు అంతరిచిపోయినయి కూడా. ఏటేటా మరో యాభై రకాలు ఈ దిశగా అంతరించే స్థితికి చేరుతున్నాయని అంచనా! పులులు, తోడేళ్లు, సొరచేపలు లాంటి వేటాడే ప్రాణులు అంతరిస్తే, ఆహార చక్రంలో పెద్ద మార్పులువస్తాయి.

జాతులు తుడిచిపెట్టుకుపోయే మహాతరంగం, మనిషి కారణంగా మరోసారి జరుగుతున్నదని పరిశోధకులు అంటున్నారు. మన అవసరాలు పేరున, నేల, నీరు, గాలి మొదలైనవాటి తీరును పూర్తిగా మారుస్తున్నాము. వాతావరణం వేడెక్కుతున్నదన్న విషయం అందరూ అంగీకరించినదే. వ్యర్థ పదార్థాల సమస్య మరోవేపు పెనుభూతంగా పెరుగుతున్నది. పర్యావరణం, ప్రకృతి ఒకే రకంగానే ఉంటేనే మానవజాతి మనుగడకు సాగుతుంది.
మనుషులు బతికితే చాలదు. మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశం కాదు, ఆర్థిక శక్తిగా మారింది అంటున్నారు. అయినా కోట్లమంది ఆకలితో బతుకుతున్నారు. ప్రపంచం మొత్తం మీదలాగే మన దేశంలోనూ కొన్ని ప్రాంతాలలో పరిస్థితి బాగుందన్న భావం కలిగిస్తుంది. మన దేశంలోనూ ‘ఆఫ్రికా’ లాంటి పరిస్థితులు అక్కడక్కడ ఉన్నాయి. బీమారూ (బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్) రాష్ట్రాలకు ఇంకా ఆ పేరు పోనే లేదు. ఒక్క కోల్‌కత నగరంలోనే 2025 నాటికి నాలుగున్నర కోట్లకుపైన జనం ఉంటారని లెక్క తేల్చారు. ఈ నగర విస్తీర్ణం పెరగటానికి వీలు లేదంటే ఆశ్చర్యం. జనాభా విషయంలో మొత్తం ప్రపంచానికి ఇదొక నమూనా! ప్రభావాలను జాగ్రత్తగా అంచనా వేయాలి!

No comments:

Post a Comment