Wednesday, November 23, 2011

నాగసూరి పుస్తకం - సమీక్ష


సైన్స్ దృక్పథం (సైన్స్ విజ్ఞాన వ్యాసాలు)
రచన: డా. నాగసూరి వేణుగోపాల్
డా. పి. బాబి వర్ధన్
పేజీలు: 104, ధర: రూ. 50/-
ప్రతులకు:
విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
బ్యాంక్ స్ట్రీట్, హైదరాబాద్
సైన్సుకు స్వంతంగా ఒక దృక్పథం ఉండదు. స్వంత విలువలు కూడా ఉండవు. సైన్సుకు ఒక తత్త్వం ఉంటుంది. అది ఒక పద్ధతిలో కొనసాగుతుంది. విజ్ఞాన పద్ధతి ప్రకారం ఆలోచించే మనుషులకు ‘శాస్ర్తియ దృక్పథం’ అలవాటవుతుంది. మానవ విలువలకూ అక్కడ కొత్త అర్థాలు పుడతాయి.

పత్రికలు, మాధ్యమాలకు సైన్సంటే ఒక రకమయిన భయం. ముందు అది వారికి అర్థం గాదు. అర్థమయిన చోటికి రాస్తే చదివే వారికి అర్థం గాదు. ‘‘రాజకీయ వార్తలు చదివినంత హాయిగా సైన్సు వార్తలు చదవగలరా?’’ అన్న ప్రశ్నతో ఈ పుస్తకం మొదలవుతుంది. ఇందులో సైన్సు రచనల గురించి కూడా చర్చ ఉంది. అందులో పేర్లు కనబడిన వారంతా సైన్సులోని అంశాలను ఎంచుకుని వాటి గురించి రాశారు. ఈ రచయితలు మాత్రం అసలు సైన్సు ఏమిటి? ఎందుకు? ఎట్లాంటి విషయాలను గురించి రాశారు. అందుకని వీరిని అభినందించాలి.

వీళ్ళు సైన్సు అంటే ఏమిటి? అని నిర్వచించే ప్రయత్నం చేశారు. స్థూలంగా అని మొదలుపెట్టి ఇంచుమించు ఒక వివరణ ఇచ్చారు. సైన్సు అలాగుంటుంది. మనిషికి తోడ్పడిన ప్రతి అంశం, సైన్స్ రంగం కూడా అని ఒక మాట వదిలారు. ఇది సమగ్రం కాదేమో? అయినా ఆలోచనకు ఒక ప్రాతిపదిక మొదలయితే పాఠకులు, విషయంలో తలమునకలవుతారు. అదే విషయం ముందుకు సాగిస్తూ వీరు సైన్స్ ఫిక్షన్, పాపులర్ సైన్స్‌ల మధ్య తేడాను చూపే ప్రయత్నం చేశారు.

అవసరం లేదు. అర్థం కాదు. అనుకుంటే ఈ ప్రపంచంలో ఏదీ అర్థం కాదు. అందరూ సినిమాలు అర్థమవుతాయి గనుకనే చూస్తున్నారా? కాలక్షేపానికి అవసరం గనుక చూస్తున్నారు. సైన్సు కూడా మనకు అంతగానూ అవసరమని, ఈ పుస్తకంలోని వ్యాసాలు చెపుతున్నాయి. ‘సైన్సు మా పిల్లలు చదువుతారు!’ అనే వారంతా ఓపిక చేసుకుని ఈ రకం వ్యాసాలు చదవాలి. సైన్సు-ప్రజలు-సమాజం క్రమంలోని వ్యాసాలు చర్చకు మంచి ప్రాతిపదిక వేస్తాయి. సైన్సంటే మనగురించి, పరిసరాలు, ప్రపంచం, పరస్పర సంబంధాల గురించి నడిచే అవగాహన. అది మరీ లోతయే సరికి కొంచెం దూరంగా కూడా అయింది! అందుకే విషయాన్ని గురించి మరింత చర్చ నడిపించారు ఈ రచయితలు. పత్రికలు, మిగతా ప్రసార మాధ్యమాలు, సరయిన అవగాహనతో ఈ బాధ్యతను తీసుకుంటే మనుషులలో ఆలోచన ధోరణి మారుతుంది. మీడియాలో పరిస్థితులను గురించి జర్నలిజం నిపుణులయిన ఈ రచయితల చర్చ బాగా సాగింది.

తెలుగునాట, భారతదేశంలో ప్రపంచంలోని వైతాళికుల గురించి వ్యాసాలు మొక్కుబడిగా ఉన్నాయి. అందుకు కారణం ఈ వ్యాసాలు. ముందు ఏదో పత్రిక కొరకు రాయడం. అన్నట్టు పండిత గోపాలాచారి గారు కనిపించారు గానీ, యెల్లాప్రగడ సుబ్బారావు గారు ఏరీ? షంసుల్ ఉమర్ గురించి మరింత తెలిస్తే బాగుండును అనిపించింది.
సైన్సు రాసినా, దాని గురించి రాసినా, భాష సమస్య అని అందరూ అలవాటుగా అంటూ ఉంటారు. ఈ పుస్తకంలో ఆ సంగతి కూడా చర్చకు వచ్చింది. విషయంపట్ల విధేయతగల ఈ పరిశోధక రచయితలు పదాల గురించి మరింత కృషి చేస్తే ఎందరికో ప్రయోజనం ఉండి తీరుతుంది. జెన్ అంటే పుట్టుకకు సూచన. జెనెటిక్స్ అంటే పుట్టుకల శాస్త్రం. హైడ్రోజెన్ అంటే నీటి పుట్టుకకు కారణం. కనుకనే అది సంస్కృతంలో ఉదజని!

కలాం, కొడవటిగంటి, నండూరి రామ్మోహన రావు గారల గురించిన వ్యాసాలున్నాయిక్కడ.
ఈ వ్యాసాలు ఒక పథకం ప్రకారం రాసినవి కాకున్నా వాటినలా సర్దడం బాగుంది. ముందే సైన్సు. అందునా సైన్సు గురించి కనుక ఈ రచయితలు తమ భాషను మరింత సులభంగా ఉండే తీరుకు మార్చుకుంటే రీడబిలిటీ పెరుగుతుంది. ‘పరిశోధనా ఆకాశంలో స్ర్తి సగం కాదని వాస్తవాలు చెబుతున్నాయి’ లాంటి వాక్యాలు ఇంగ్లీషు వాసన కొడుతున్నాయి.

ఈ రచయితల కృషికి వినియోగం, మరింత కృషి జరుగుతుందని ఆశిద్దాం.

No comments:

Post a Comment