Tuesday, November 22, 2011

నీటిమీద నూనె - రంగులు


నీటిమీద నూనె ఏదైనా పడితే దానిమీద రంగులు కనబడతాయి. ఎందుకు?

కేవలం నీరే ఉండి, దానిమీద వెలుగు ఎంతగా నాట్యం చేసినా రంగులు కనబడవు. కేవలం చమురు ఉన్నా సరే, దానిమీద రంగులు కనబడవు. ఇక నీళ్లమీద, మనం మామూలుగా వంటలో వాడుకునే మంచి నూనెవేసి చూడండి. దానిమీద కూడా రంగులు కనబడవు. వేరే నీళ్ల మీద కొంచెం కిరోసిన్ వేసి చూడండి. కొంచెంగా రంగులు కనబడతాయి. (నిజంగా ఈ ప్రయోగం చేయదలుచుకుంటే, పిల్లలు పెద్దవాళ్ళనడిగి, వారి సాయంతో చేయాలి. లేకుంటే గొడవ!)


వర్షం తరువాత రోడ్డు మీదకు నీరు పారుతుంది. దానిమీద మాత్రం రంగులు నాట్యమాడుతూ కనబడతాయి. ఇందుకు కారణం సులభంగా చెప్పవచ్చు. రోడ్డుమీద నడిచే రకరకాలవాహనాలనుంచి చమురు చుక్కలు కిందపడతాయి. వర్షం నీటి మీద ఆ చమురు పలుచని పొరగా పరచుకుంటుంది. నీటికంటే చమురు సాంద్రత తక్కువ. కనుక అది నీటి మీద నిలుస్తుంది. ఇక్కడ ఉండే చమురులలో సర్‌ఫెక్టెంట్స్ అనే రకం రసాయనాలు కలిసి ఉంటాయి. అందుకే చమురు నీటి మీద అంతటా పరచుకుంటుంది. మంచి నూనెలో ఈ రసాయనాలు ఉండవు. పైగా దాని సాంద్రత కొంచెం ఎక్కువ. కనుక, అది నీటిమీద అంత సులభంగా పరచుకోదు. నీటిమీద తేలడం మాత్రం తేలుతుంది. అంటే మొత్తానికి చమురు నీటి మీద పరచుకోవడం, ఆ పొర మందం, అది మధ్యలో ఎక్కువగా ఉండడం మీద రంగుల సంగతి ఆధారపడి ఉంది.

చమురు మీద పడిన వెలుగు, రెండు చోట్ల నుంచి పరావర్తనం చెందుతుంది. అంటే తిరిగి వెనుకకు వస్తుంది. చమురు పొర పైతలం నుంచి ఒకసారి, ఆ పొర నీటికి తగులుతూ ఉండే, లోపలి తలం నుంచి మరొకసారి, అది ప్రతిఫలిస్తుంది. ఈ రెండు వెలుగులమధ్య కొంత తేడా ఉండడం సహజం. ఆ తేడా వల్లనే రంగులు కనబడతాయి. ప్రతిఫలించే కాంతి మార్గాలు, ఒకే స్థాయిలో ఉన్నంతకాలం, రంగులు కనబడవు.

మరి, రంగులు ఎక్కడివి అనే ప్రశ్నకు సులభంగా సమాధానం చెప్పాలంటే, సూర్యకాంతిలో ఏడు రంగులు కలిసి ఉంటాయి. వర్షం తర్వాత, నీటి తుంపరలో, ఆ కాంతి ప్రతిఫలించి, ఇంద్రధనుస్సుగా కనబడుతుంది. పట్టకం అనేగాజు దిమ్మెలో కూడా కాంతి విడిపడి కనబడుతుంది. నీటిమీద వ్యాపించిన చమురు పొర తగినంత మందం ఉంటే, అందులోనూ, కాంతి విడిపోయి రంగులు కనబడతాయి. *

No comments:

Post a Comment